ఉపసంహారం

‘జావళీ’ ప్రక్రియ తెలుగు సాహిత్యంలో విశిష్టమయినదీ, విస్తృతమైనది కూడా. దక్షిణ భారత దేశమంతటా తన ప్రాభవాన్ని విస్తరింపజేసి, సంగీత సాహిత్యాత్మకంగా సాగిన తెలుగు వారి సాహిత్య హృదయాన్ని సమ్యక్ మేళనం గావించిన అపురూప ప్రక్రియ.

కేవలం శబ్ద ప్రాధాన్యం, రాగ ప్రాధాన్యం గల రచన గానే కాక, భావ ప్రాధాన్యానికి, నాయికా నాయకుల అంతరంగ ఆవిష్కరణలకి, శృంగార రస పరిపుష్టికీ ఆలవాలమై, సంగీత సాహిత్య రంగాల్ని శోభాకరం చేసింది.

పైకి శృంగారంలా కనిపించినా, వేదాంత పరమైన లక్ష్య సాధనతో మహత్ప్రయోజనాన్ని ఆకాంక్షించే దిశగా ఆవిర్భవించింది. ఎన్నో గొప్ప కావ్యాలకు కూడా తెలియని మన సాహిత్యంలో జావళీ, జావళీ కర్తల వివరాల్ని చక్కగా ముద్రల రూపంలో కలిగిన జావళీలు సాహిత్యంలో జావళీల విషయాలలో వివాదాలకు తెర దించింది.

వివిధ కాలాలలో క్రమ పరిణామ వికాసాన్ని పొంది, నాయకుడు, నాయిక, చెలి ప్రధాన పాత్రల్ని భూమికలుగా చేసుకొని, నాటి సమాజం లోని స్త్రీ-పురుష సంబంధాన్ని స్థితి గతుల్ని, సామాజిక నేపథ్యంలో విశదం చేసింది. సజీవ మానవ స్వరూప స్వభావాల్ని చక్కగా ఆవిష్కరించి చూపింది.

ప్రాచీన కాలం లోనూ, ఆధునిక కాలం లోనూ వెలసిన జావళీలు కాలానుగుణ్యంగా మార్పును పొందాయి. ప్రాచీన కాలంలో సాంప్రదాయ సాహిత్యానికి గౌరవాన్ని కల్పిస్తూ, కవి సమయాన్ని పాటిస్తూ, వర్ణనల్ని తనలో పొందు పారుచుకోవడమే కాక, ఆధునిక కాలంలో సంభవించిన ఆంగ్ల భాషా ప్రవేశంతో ఏర్పడిన కాలానుగుణ పరిణామ పరిస్థితుల్లో ఆంగ్ల భాషా పదాల్ని కూడా తనలో పొదువుకొంది.

సంగీత ప్రాధాన్యంగా తెలుగు, తమిళ సినీ రంగాల్ని సైతం ప్రభావితం చేసింది. ఆయా సందర్భాలకు తగిన విధంగా మనోరంజకమైన చక్కని గీతాలు ఆవిర్భవించడానికి జావళీ ఉత్ప్రేరకంగా పని చేసింది. సంగీత సాహిత్యాలలో జనించే, శాబ్దిక ఆర్థిక పరమైన జనానందాన్ని సాధించే వారధిలా నిలిచిన జావళీ సంగీత రంగానికే కాక, సామాజిక రంగానికి కూడా మహత్ప్రయోజనకారి అయ్యింది.

సంగీత సాహిత్య రంగాలలో సమాన ప్రతిపత్తి కలిగిన జావళీలపై ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలను సమగ్రంగా పరిశీలించగా ‘జావళీ’ ప్రక్రియ స్వరూప స్వభావాల విషయంలో ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.

కానీ కన్నడ జావళీలను పరిశీలించి విశేషంగా కృషి చేసిన శ్రీ కె.వి. ఆచారి గారు జావళీలపై ఈ కింది అభిప్రాయాలు ప్రకటించారు. వీరి అభిప్రాయాలను పరిశీలిస్తే అవి జావళీలకు, తెలుగుకు గల సంబంధాన్ని ఊహించడానికి దోహదం చేస్తాయి.

“జావళీలు తెలుగు నుండి కన్నడం లోనికి వచ్చి ఉంటాయనీ,
తెలుగు జావళీలు ముందే వచ్చాయని కొందరి విద్వాంసుల అభిప్రాయం.”

“వడి తెలుగు నుంచి 17వ శతాబ్దంలో లోకి వచ్చినట్లే జావళీలు తెలుగు నుంచి కన్నడం లోకి వచ్చి ఉంటాయి.”

“వడి-వళి ప్రధానంగా గల పాటలే ఈ జావళీలు, అందులో కూడా ముఖ్యమైన ఛందస్సుకు సంబంధించినదా అన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.”

“దేవదాసీలు అంగ భోగ సేవలో దేవుని లక్ష్యంగా చేసి పాడి ఉండవచ్చు.”

సంగీత ప్రపంచంలో ఇప్పటి వరకు జరీన పరిశోధనలలో అందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం ఏమిటంటే జావళీ పుట్టుక్క 19వ్స్ శతాబ్దంలోనే జరిగిందని. కానీ దీని పుట్టుక ఎలా 19వ శతాబ్దిలో హఠాత్తుగా సంభవిస్తుంది. అలా పుట్టి, పుట్టిన వెంటనే ఎలా వచ్చిందో అలాగే ఆశ్చర్యం అయిందంటే నమ్మశక్యం కాదు.

ఇప్పటి వరకు నా పరిశీలనలో నాకు లభించింత వరకూ ఉన్న జావళీలను పరిశీలించగా క్రీ. శ. 1450 ప్రాంతంలో లభించిన వల్లభరాయ ముద్ర గల జావళీ ఆధారంగానే జావళీ పుట్టుక 15వ శతాబ్దిగా నిర్ధారింపవచ్చు.

బేహాగ్ – ఆది

మగనాల తాళర నే

పదుగురిలో నను, మదనుని కేళికి
గదియ రమ్మనెదవు, పదరా నే

వడ్డారముననీ, వడ్డము జేసిన
చెడ్డది మా యత్త, చెడ్డదిరా నే

వల్లభుడొచ్చు శ్రీ వల్లభరాయ నీ
పిల్ల చేష్టలిందు చెల్లవురా నే

వినుకొండ వల్లభ రాయలు క్రీడాభిరామకర్త. ఇతడు క్రీ.శ. 1425-1500 ప్రాంతంలో జీవించినవాడు. వల్లభరాయ ముద్రతో గల ఆ జావళీ వల్లభ రాయలు రచన గానీ, వల్లభ రాయలకు అంతికమైనదై కానీ అయి ఉండవచ్చు. ఈ ఒక్క జావళీ లభించింది. అంటే ఆ కాలంలో అనేక జావళీలను కవులు రచించి ఉండవచ్చు. కానీ మన అదృష్టమో, దురదృష్టమో గానీ, మిగిలినవేవీ దొరకకుండా ఈ ఒక్క జావళీ మాత్రమే లభించి, జావళీ పుట్టుకకు ప్రాచీనాధారంగా నిలిచింది. తెలుగు సాహిత్యంలో ఆనాటి అనేక రచనలకు పట్టిన గతే దీనికీ పట్టటం వలన జావళీలు అదృశ్యం అయి ఉండవచ్చు.

వల్లభ రాయల ముద్ర తోనే కాక, తిరుమల రాయలకి అంకితంగా రచించబడిన ఇంకొక జావళీ కూడా లభించింది.

కమాచి – ఆది

రమణిరో సామి రాతి రేమననే ఓ

కమల నయనరొ నా కాంతుడు జూచి
తా సుముఖుడై వరియించెనే ఓ

కర్పూర వీటికా గంధ పుష్పాదుల
నర్పణ శాయ గైకొనెనే ఓ

తిరుమల దేవరాయ కరివీరకాదీయ
కరుణతో జూచి గైకొనెనే ఓ

ఈ జావళీ క్రీ.శ. 1565 సం॥ తరువాతదని చెప్పవచ్చు.

ఆ పిమ్మట 1623-1672 ప్రాంతాల్లో వసించిన క్షేత్రయ్య రచించిన ఒక జావళీ లభిస్తోంది.

సురటి – ఏక

ప॥ మాయలాడి బోధనలచే మైమరచితి వేమో
మాటలాడ రావదేమిరా యో సామి

అ॥ ప॥ కాయజుని బారికి తాళగ లేరా
కౌగిటి జేర్చి నను గారవించరా
న్యాయమటరా నీకిది తగదురా సరస గుణ

చ.1 ॥ కలకాలము నన్ను గాసి
పెట్టుటకురా కాంత నేచుడ
కార్యము గాదుర చెలువుడ వని
నిను నెర నమ్మినందు కిక

చ.2.॥ సరి వారిలో నను చౌక
సేయకురా చాల నమ్మితి రతి
కేళి కూడరా వరదుడ
మువ్వపురి నిలయుడ చనువున

పై రచనలో “మువ్వపురి నిలయుడ” అనే ప్రయోగాన్ని బట్టి ఈ ముద్ర క్షేత్రయ్యదే నని చెప్పవచ్చు. దీని ఆధారంగా క్షేత్రయ్య కూడా జావళీలు రచించాడనే విషయం సుస్పష్టం.

(To be continued… Last edited 22 Feb 2026)