స్త్రీ స్వరూప స్వభావాదుల్ని బట్టి భారతీయాలంకారికులు నాయికా భేదాల్ని పేర్కొన్నారు. అవయవాదుల ద్వారా ప్రకటించే భావాలను, స్వతఃసిద్ధంగా స్త్రీ సహజమైన కొన్ని నైజాలను, శృంగార విషయంలో వారి వారి ప్రవృత్తులను, ఆకారాది రూపు లావణ్య విశేషాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు.
ఇక శృంగార విషయానికొస్తే అష్టవిధ శృంగార నాయికలనే ఒక విభాగం చేశారు నాయిక నాయకుని విషయంలో వివిధ సందర్భాలలో ప్రదర్శించే హావభావ విన్యాసాల ఆధారంగా, మనో భావాలకు అనుగుణంగా, కోపతాపాలకు అనురూప్యంగా శృంగార నాయికా భేదాలు ఏర్పడ్డాయి. ఇవి ఎనిమిది విధాలు:
- స్వాధీన భర్తృక
- వాసక సజ్జిక
- ఖండిత
- కలహాంతరిత
- విప్రలబ్ధ
- విరహోత్కంఠిత
- ప్రోషిత భర్తృక
- అభిసారిక
శృంగార రస ప్రధానంగా జావళీ రచన సాగింది కాబట్టి అందులోనూ నాయికా నాయకుల పరస్పర సమాగమం కోసం, వారు పడే ఆవేదనల్ని ప్రస్ఫుటించేవి కాబట్టి, ఆయా సందర్భాలలో జావళీ కర్తలు ఈ అష్టవిధ శృంగార నాయికా లక్ష్ణాల్ని సైతం తమ జావళీలలో ప్రయోగించి రచించారు. ఆ విషయాల్ని విశ్లేషించడమే ఇక్కడ ప్రధానోద్దేశం.
అలంకారికులు నాయికల స్వరూప స్వభావాల్ని బట్టి వారిని అష్ట విధ నాయ్యికలుగా విభజించారు. నాయికా నాయకుల మధ్య ఎంత అనురాగమున్నా వారి వారి ప్రవర్తన, మాట తీరు, మానసిక స్థితి – పరిగణ లోనికి తీసుకుని ఈ విభజన చేశారు.
స్వాధీన భర్తృక:
పురుషుని తన గుణం చేత వశం చేసుకునేది. నాయకుడు ఎల్లప్పుడూ తన పక్కనే ఉండగా అధికమైన మోదం, అభిమానం కల్లిగి ఉండే నాయిక. ఎల్లప్పుడూ తన యింగిత మెరిగి తన యాజ్ఞకు లోనుగా నడిచే పతి కలది.
క్లుప్తంగా చెప్పాలంటే – స్వాధీనమైన భర్త కల శృంగార నాయిక అని అర్థం.
ఫరజు – ఏక
ఇన్నాళ్ళ వలె గాదె వాని గుణమెంతని విన్నవింతునె ఓ చెలి
నన్నెడ బాయడు అన్యుల జూడడు
మన్నన వీడడు మానినీ మణిరో
వన్నెకాడె యెందున్నడె
వాడన్నిటి నెర జానుడె
సుందర శ్యామ వెంకట రమణుడు
నెనరున కలిగిన నేదాన గాన ఓ మద గజ గమనరొ (1)
సుందర శ్యామల వెంకట రమణునికి అంకితమయిన ఈ జావళీలో స్వాధీన పరికాలక్షణం స్పష్టంగా కనిపిస్తుంది.
నాయిక చెలితో తన నాయకుని గూర్చి చాలా గర్వంగా చెప్పుకుంటోంది. తనను ఎడబాయడన్న నమ్మకంతో ఉంది, ఇతరులను కన్నెత్తి చూడనే చూడడట. తానంటే చాలా గౌరవం కలవాడట. తన నాయకుడు తనను వీడడనే గట్టి నమ్మకం తనకున్నదట.
అలాగే ఈ జావళీలో కూడా స్వాధీన పతికా లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఫరజు – ఆది
స్మర సుందరాంగుని సరి ఎవ్వరే
సరస కోటి లోన వజీరుహమీరె
ఆడిన మాటకు అడ్డము బలుకడే ఏ
చేడియలను కనుల జూడడే
వీనుల కింపుగ వీణ వాయించి అలి
వేణి నే పాడగ శాభాషిచ్చునే
ధరణిలో రతి దేల్చు ఉదార శ్రీ
ధర్మ పురాధిపు డైనట్టి మా
నాయిక నాయకుని గూర్చి చెలితో గొప్పగా చెప్పుకుంటోంది.
ధర్మ పురాధిపుడైన తన నాయకునికి సరి ఎవరూ లేరట. అంత అందగాడట. తన మాటలకు ఎప్పుడూ అడ్డం పలుకడట. తను ఏది పలికినా కాదు అని అనడట. తన ఎదురుగా తిరుగాడు చేడియలను సైతం కన్నెత్తి చూడడట.
నాయికకి తన నాయకునిపై ఎంత నమ్మకమో, తనకు విధేయుడుగా ఉంటాడే కానీ ఎప్పుడూ బాధ పెట్టడట.
వాసక సజ్జిక:
“ప్రియాగమ వేళ గృహమున్
తనువున్ సవరించు నింతి వాసవసజ్జిక”
అని కావ్యాలంకార సంగ్రహం వాసక సజ్జికా లక్షణాన్ని పేర్కొంటోంది. అంటే –
“ప్రియుడైన నాయకుడు వచ్చే సమయానికి
ఇంటినీ, ఒంటినీ చక్కదీర్చుకొనే నాయిక” అని అర్థం.
తన పడకటింటిని సింగారించి నాయకునికై ఎదురు చూస్తే నాయిక, ప్రియుని కోసం సురత సామగ్రి సన్నాహం చేసి, తాని అలంకరించుకుని ఎదురు చూసేది. తన మనసైన ప్రియుడు వచ్చే వేళకు ముంగిటినీ, పడకటింటినే అలంకరించి ఎదురు చూసే నాయిక ఈ వాసక సజ్జిక.
ఈ కింది జావళీలో వాసక సజ్జిక లక్షణాలన్నీ సంపూర్ణంగా గోచరమవుతాయి.
కాంభోజి – రూపక
ఏమి మాయము చేసి పోతివో శ్యామ సుందరాంగా నాతో
…
…
మంగళ స్నానము రంగుగ జేసే ఉప్పొంగుచు నీ మృదు
అంగ సంగముతో కౌగలించేనని వంగి వళంగి శ్రీ
మంగళాంగుడౌ తాఆలవనేశుని
నాయిక నాయకుని కోసం ఎదురు చూస్తోంది.
తాళవనేశుడు నాయకుడు. చక్కగా మంగళ స్నానం చేసింది. తన నాయకుడు వస్తాడని ఉప్పొంగుతూ అంగ సంగంతో కౌగిలిలో బంధిస్తాడనీ ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. మంగళాంగుడైన ఆ తాళవనేశుని కోసం వంగి నమస్కరించడానికి సిద్ధపడుతోంది.
విరహోత్కంఠిత:
నాయకుడు ఇంకా రాడాయెనని విరహం చేత చింతించే నాయిక. పెనిమిటి రావడానికి ఆలస్య మయినందుకు విరహ పడేది. కన్నీరు కార్చడం, తన గోడు చెలికత్తెతో చెప్పుకోవడం వంటి భావాలు కలది.
బ్యాగ్ – రూపక
ఈ విరహ మెటులోర్తునే చెలియా
నేమి సేతు నా మనోహరుండు రాడటేనా
సామి కే మిటారి దూరు చెప్పెనె చెలియా
యెందాక సైతు వానిబాసి యీ సుమ శరుని
చిగురాకు బటకుచే కుచంబు దాకెనె చెలియ
నే తాళజాల బాలచంద్ర సామిని బాసి
నాయిక చెలితో తన విరహాన్ని తెలుపుకుంటోంది. బాలచంద్ర సామి, తన నాయకుడు రానందుకు దుఃఖిస్తోంది. ఏ మిటారి అడ్డగించిందో, రాకుండా చేసిందో, లేకపోతే తప్పక వచ్చేవాడే అనే నమ్మకాన్ని కూడా వెళ్ళబోసుకుంటోంది. తన నాయకుని వీడి తాను బతకలేననీ! సుమ శరుని చిగురాకు బాకుచే కుచంబు దాకెనె! అని తాళజాలననీ, బాలచంద్ర సామి రానందుకు తాను తట్టుకోలేక పోతోందని, విరహాన్ని భరించలేనని, చెలితో చెప్పుకుని బాధ పడుతోంది నాయిక.
సురపురి వేణుగోపాల ముద్రతో ఉన్న మరొక జావళీలో నాయిక తన చెలితో మొర పెట్టుకుంటోంది.
తోడి – అట
యెటువలె సైచుదునే విరహము
యింతిరో విరహము యెందని యోర్తునె
కాంతుని బారికి కలియ రమ్మను మనె
…
…
వేమురు సురపురి వేణుగోపాలుని
కాముని కేళిని కలవర మందితి
సురపురిలో ఉన్న వేణు గోపాల స్వామి నాయకుడు. నాయిక విరహాన్ని ఎడబాటును భరించలేక చెలితో మొర బెట్టుకుని దుఃఖిస్తోంది. విరహాన్ని తాను తట్టుకోలేక పోతుందట. కాముని కేళికి ఆతృత పడుతోంది. చెలిని తొందర పెట్టి తన విరహాన్ని అర్థం అయ్యేట్లు తెలిపి దొఃఖిస్తూ తన పతిని తీసుకు రమ్మని బతిమలాడుతోంది నాయిక.
విప్రలబ్ధ:
నాయకునిచే సంకేత స్థలంలో వంచింపబడి దుఃఖించే లక్షణం కల నాయిక. వ్యాకుల హృదయి అయిన నాయిక. ప్రియుడు రానందుకు అతనిచే వంచింపబడినట్లు తలపు గల నాయిక.
కానడ – మిశ్ర చాపు
చారుమతి యుపచారము లేటికే
మీరిన శోకము లేరీతిగ తీరు
సరసుడు జూడని యాభరణము లేటికే
మరచే నటనే! కరుణాశాలి
వేగమే ప్రాణేశుడు రాగలడో రాడో
జాగు చేయునో! నాగవేణీ రో
నాయిక నాయకుని కోసం ఎదురు చూస్తోంది. తప్పకుండా వస్తానని చెప్పడం వల్ల్ల చక్కగా అలంకరించుకుని సిద్ధంగా ఉంది. చెలితో తాను నాయకునిచే వంచింపబడినట్లు చెప్పుకుంటోంది.
తనకు శోకాలు అధికమవుతున్నాయనీ ఎన్ని ఉపచారాలు చేసినా ఉపయోగం లేదనీ చెలితో చెప్పుకుని బాధ పడుతూ తన శోకం ఏ రీతిగా పోతుందో అంటూ దుఃఖిస్తోంది.
చక్కగా అలంకారాలు పెట్టుకుని ఎదురు చూస్తున్న నాయిక సరసుడు రాకపోవడంతో, ఆ ఆభరణాలు ఎందుకని విరక్తిగా మాట్లాడుతోంది. కరుణాశీలి అయిన నాయకుడు నిజంగా వస్తానన్నాడు. మరచి పోయాడా? అనే శంకను చెలితో చెప్పుకుంటోంది నాయిక.
ఓ నాగవేణీ – నిజంగా వస్తాడా? రాగలడో, రాలేడో, ఏమి ఆటంకాలు వచ్చాయో, ఆలస్యంగా వస్తాడో, అంటూ భర్త రానందుకు దుఃఖిస్తూ, వంచనకు గురైనట్లుగా భావిస్తూ, చారుమతీ – అని సంబోధిస్తూ తన చెలితో బాధని పంచుకుంటోంది నాయిక.
శంకరాభరణం – ఆది
యేమిర నా సామి నీకిది తగున
కామినుల యెడ నిట్టి నీమవు మాటలకును
నిన్న రేయి వచ్చేవనీ నిద్ర లేక వేసారితి
వన్నెలాడి నీతోమరి కన్ను సయిగ చేసెనేమొ
అతివరో వచ్చేనని ఆన బెట్టె పోతివిర
ప్రాణనాథ నీవే బల్ జాణవే శబాసుర
తప్పక సురపురి దైవరాయ గోపాల
ఇప్పుడైనను గూడమంటె తప్పు మాట లాడెదవే
ఈ జావళీలో నాయిక నాయకుని వంచన గురించి నిలదీసింది. ఇది తగునటరా అని ప్రశ్నించింది. రాత్రి వస్తానని, నిద్ర లేక నీకోసం పడిగాపులు పడి ఎదురు చూస్తే నీవు రాలేదు. ఏ వన్నెలాడి కన్ను సైగ చేసిందో అని సవతిని విమర్శించింది. ఒట్టు పెట్టుకుని వస్తానని చెప్పి, ప్రాణనాథ! గొప్ప పని చేశావులే, గొప్ప జాణుడవే, శహబాస్ అని ఎద్దేవా చేసింది.
ఇప్పటికైనను మించి పోయింది లేదని, తనను కూడుమని, తప్పు మాట లాడవద్దని సురపురి దైవరాయ గోపాలుని ప్రార్థించిది.
బ్యాగ్ – రూపక
అంతలోనె తెల్లవారె అయ్యో యేమి సేతునే
కాంతుని మనసెంత నొచ్చెనొ ఇంతి యెటు సైతునే
కొదమ గుబ్బ లెదను గదియ నదుము కొనుచు
చాలా పెదవి తేనె లాన నా మదిని దోచు వేళ
పంతమున తటాల లేచి పైట కొంగు జారగా
కాంత దొంతర విడె మొసంగి కౌగలింపు చుండగా
సోమ భూపాల రమ్మని భామ ప్రేమ మీరగా
కాము కేళి లోన మిగుల కలసి మెలసి యుండగా
సోమ భూపాలుడు నాయకుడు. నాయిక చెలితో దుఃఖిస్తూ చెపుతోంది. “కొదమ గుబ్బ లెదను గదియ నదుము కొనుచు, ముద్దు పెట్టు కొనుటకు పెదవి తేనెలానగా అంతలోనె తెల్లవారి పోయిందే. అయ్యో నేనేమి చెయ్యగలను. నా కాంతుడు ఎంత నొచ్చుకున్నాడో.”
“పైట కొంగు జారగా, దొంతర విడెమిచ్చి కౌగలింపు చుండగా, ప్రేమ మీర కామకేళి లోన మిగుల కలసి మెలసి యున్న వేళ – అయ్యయ్యో ఏమి చెప్పనే – అంతలోనే తెల్లవారి పోయింది” అంటూ పాపం, నా భర్త ఎంత బాధ పడ్డాడో అంటూ వాపోయింది నాయిక.
(to be continued… Last edited 19 Dec 2025)