7.1 తెలుగు జావళీలు – వర్ణనా సౌందర్యం (Part 1)

కవిత్వం నవనవోన్మేషమైనది. భావ ప్రపంచాన్ని ఆవిష్కరించే కమనీయమైన లక్షణం కలది. విశ్వనాథుని అభిప్రాయం ప్రకారం ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అని నిర్వచించినా, లేదా, “ఇష్టార్థర్య వచ్చిన పదావళిః కావ్యం’ అన్న దండాచార్యుని కావ్య లక్షణాన్ని స్వీకరించినా, సుప్రసిద్ధ సాహిత్య అలంకారికుడు మన ఆంధ్ర దేశానికి చెందినవాడూ అయిన జగన్నాథ పండిత రాయలు పేర్కొన్నట్లుగా ‘రమణీయార్థః ప్రతిపాదక శబ్దః కావ్యం’ అని ఆమోదించినా కవి కృతమైన ప్రతి రచనా కావ్యమే అవుతుంది.

“అపారే కావ్య సంసారే
కవిరేవ ప్రజాపతిః” అన్నారు.

కవి బ్రహ్మతో సమానమైన వాడు. ఈ సృష్టిలోని వస్తు స్వరూపాన్ని దర్శించి, తనదైన రీతిలో ఆవిష్కరించే ప్రజాపతి. కాబట్టి సామాన్యుడు కవి కాజాలడు.

“నా నృషిః కురుతే కావ్యం” అన్నారు.

ఇలా ఏ అభిప్రాయాన్ని స్వీకరించినా కవి మస్తిష్కంలో ఆవిర్భవించిన రచన దివ్య గుణ శోభితమై అలరారుతుంది. కవి హృదయం నుండి వెలువడ్డ ప్రత్యక్షరమూ ఒక కావ్యమే అవుతుంది. అందువల్ల తెలుగు వాగ్గేయకారులు ఆర్తితో, ఆలోచనతో రచించిన ప్రతి సంకీర్తనా, పదమూ, కృతీ విశిష్ట గుణ యుక్తాలయిన రచనా విశేషాలతో అలరారుతున్నాయి.

సంగీతానికి సంబంధించిన గాన యోగ్యమైన రచనలలో సాహిత్య సంపద సాధారణంగా ఉన్నప్పటికీ మనలో వాగ్గేయ కారులనిపించు కోవడానికి కేవలం సంగీతం తెలిసి ఉంటే సరిపోదు. దానితో పాటుగా చక్కని భాష తెలిసి ఉండాలి. వ్యాకరణం, ఛందస్సు, అలంకార శాస్త్రం మొ॥ వాటి యందు చక్కని అభినివేశం ఉండాలి. అంతేకాదు, కావ్య సంప్రదాయం, లక్షణాలు కలిగి ఉండాలి. వీటితో పాటు స్వతంత్రంగా వర్ణలు చేయగల భావుకత, ఉచితజ్ఞత, చిత్రార్ద్రత కూడా అత్యంత ఆవశ్యకాలు.

తెలుగు పద సాహిత్యంలో ‘జావళీ’ అత్యంత విలక్షణ లక్షణోపేతమైనది. శృంగార లక్షణాలు కలది. శృంగార పద సాహిత్యంలో తాళ్ళపాక కవులు ప్రముఖ స్థానాన్ని వహించారు. తాళ్ళపాక అన్నమయ్య మొదలుకొని ప్రారంభమయిన ఈ రచనా ప్రస్థానంలో ఎందరో ప్రతిభావంతులు క్షేత్రయ్య వంటి వారు పదం మోపారు.

రస పోషణ లోనూ, అర్థ పుష్టి లోనూ, భావ పరంపర లోనూ, వర్ణనా చాతుర్యం లోనూ, అశేష ప్రతిభా పాటవాల్ని ప్రదర్శిస్తూ శృంగార రస ప్రాధాన్యమున్న రచనల్నీ, విరహావస్థలో పరితపించే పాత్రల యథార్థ సజీవ స్థితి చిత్రణను రస హృదయంతో వర్ణించి ఆవిష్కరించారు. భావ సౌందర్యం, భాషా సౌందర్యం కలగలసి సన్నివేశ శుద్ధితో పర్ణనల్ని పండించారు.

ఈ జవళీ రచనలలో శృంగార రసం విలక్షణ రీతిలో పరవళ్ళు తొక్కింది. దీనిలో వర్ణితమైన రసం శృంగారమా? లేక భక్తా? అని సందేహంలో ఆవిష్కృతమైన భావ విన్యాసాన్ని విస్మరించడం శ్రేయస్కరం కాదు.ఇక్కడ భావం ప్రధానం. ఆలంకారికుల వాద ప్రతివాదనలకు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఎంత మాత్రమూ లేదు. రసమైనా, భావమైనా ఈ జావళీలలో ఆవిష్కృతమయ్యేది భక్తి కాదు.

రూపా గోస్వామి తన అలంకార గ్రంథమైన “ఉజ్జ్వల నీలమణి”లో భక్తిని వేరే రసంగా నిరూపించడానికి సోపత్తికంగా ప్రయత్నించారు. కానీ అది కూడా శృంగార రసం గానే పరిణమించింది. అయితే ఆ శృంగారం శ్రీకృష్ణ గోపికా సంబంధమైనది. అటువంటి సంబంధమే తెలుగులో వెలసిన జావళీలకు కూడా నేపథ్యంగా నిలిచిందని నిర్ద్వంద్వంగా చెప్ప్పవచ్చు.

భక్తిలో ఉన్నది కూడా శృంగారమే. భక్తుడు పారవశ్యంలో భగవత్ పరంగా అన్ని రసాలనూ అనుభవిస్తాడు. ఆ అనుభూతిని రసావిష్కృతమైన రచనలో పొందు పరుస్తాడు. ఉదాహరణకు త్యాగయ్య కృతుల్ని గానీ, అన్నమాచార్య సంకీర్తనల్ని గానీ, క్షేత్రయ్య పదాల్ని గానీ తీసుకున్నా, ఈ విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు ఈ త్యాగరాజ స్వామి కృతిని చూడండి:

“రార! సీతా రమణీ మనోహర!
నీరజ నయన! యొక ముద్దీర!

బంగారు వల్వలు నే బాగుగా గట్టెద మరి
శృంగారించి సేవ జేసి కౌగిట జేర్చెద
సారెకు నుదుటను కస్తూరి తిలకము బెట్టెద
సారమైన మూక్తాహారముల నిక దిద్దెద
యోగము నీపై యనురాగము గాని వే
రేగతి యెవరు? శ్రీ త్యాగరాజ వినుత” (1)

ఈ కృతిలో త్యాగరాజ స్వామి ఆవిష్కరించిన అలౌకికమైన శృంగారం, నాయికా నాయకుల విరహావస్థలు, రచనకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాయి.

జావళీలలోని శృంగారాన్ని చూసి, ఇది కేవలం పచ్చి శృంగారమని ఆక్షేపించవచ్చు. ఆ తప్పు జావళీకర్తలది కాదు. బలహీనులైన ఆక్షేపకులదే. అజీర్ణ వ్యాధి గ్రస్తులకు పనసకూర అపథ్యమైతే తప్పు పనస కూరదా? మన పూర్వీకులతో పోల్చుకుంటే మన రసజ్ఞత తగ్గి పోయింది. కానీ తెలుగు జావళీలు ఎక్కడికక్కడే ఖండ కావ్యాలుగా చదువుకొంటే వాటిలోని వర్ణనల్ని భావస్ఫోరకాలుగా స్వీకరించి అనుభవించ గలిగితే అమందానందం కలుగుతుంది. జావళీలను రాగ తాళ యుక్తంగా శ్రావ్యమైన కంఠంతో ఎవరైనా భావగర్భితంగా పాడగలిగితే చలువగల వెన్నెలల చెలువునకు సౌరభం అద్దిన రీతిలో మధురంగా ఉంటాయి. సంగీతంతో పాటు తగిన పాత్రలను అభినయిస్తూ ఉంటే ఆ చలువ, సౌరభాలకు మాధుర్యాన్ని కూడా మిళితం చేస్తే ఉండే సొబగు వీటికి కూడా ఒనగూరుతుంది. ఆ మాధుర్యం ఉత్తమ సాహిత్యం వల్ల వస్తుంది.

భావ ప్రాధాన్యంగా సాగిన ఈ జావళీలలో సందర్భాన్ని బట్టి, రసావిష్కృతమయ్యే విధంగా, పాత్రల మనోగతాలకు అద్దం పడుతూ, కవులు చేసే వర్ణనల్ని నిశితంగా పరిశీలిస్తే, ఈ జావళీలకు సంబంధించిన యథార్థ సహజత్వాన్ని దర్శించే ప్రయత్నం చేసినట్లవుతుందని నా అభిప్రాయం.

అసంఖ్యాకంగా లభిస్తున్న తెలుగు జావళీలలో వర్ణనా ప్రాధాన్యమున్న వాటిని ప్రస్తుతః పరిశీలించి, తెలుగు జావళీల వర్ణనా వైభవాన్ని నిర్దేశిస్తూ ఆవిష్కరించడమే ఈ అధ్యాయంలో నా ప్రధానోద్దేశ్యం. అందుకు అనుగుణ్యమైన విషయ ప్రాధాన్యం కల కొన్ని జావళీలను స్వీకరించి ఆ జావళీల లోని వర్ణనా విశేషాల్ని ప్రస్తావిస్తాను.

జావళీలలో నాయిక సర్వ సాధారణంగా “స్వాధీన పతిక”గా ఉండాలని ఆకాంక్షిస్తుంది.

మోహన – త్రిపుట

ప॥ వేళ గాదుర గడియ తాళుర సామి

అ॥ప॥ చాలు చాలు పది వేలకైన నిది

చ॥ 1 పూరక నా పైని నేరమెంచక
పొలరుచు మా బావ గారున్నారోయి
కూరిమి నా తోడికోడలీ పడకింటి
చేరిక యందుండ మేర గాదోయి

చ॥ 2 ఒద్దికతో మన మిద్దరము కూడి
సుద్దులాడుట కిది ప్రొద్దు కాదోయి
పద్దు మీరగ నాపవ వారి వద్దనేయీ
సుద్ది విన్నంత కొద్ది కాదోయి

చ॥ 3 నిరతము శ్రీనాదపురి నిలయుడైన
మురళి గాన లోల మువ్వ గోపాల
యర విరుల పాన్పు పైని మరు కేళి నన్ను గూడి
తిరుగ పొరుగింట తిరుగు కాదోయి

అంటూ తనతో సమాగమించి ఆనందాన్ని అందించమంటూ, పరకాంతా సమాగమాన్ని గర్హిస్తుంది నాయిక.

నాయకుడు కూడా విరహాన్ని తాళలేక పదే పదే వేదన ననుభవిస్తూ నాయికను వేడుకోవడం ఈ జావళీలో ఇలా ఆవిష్కృతమయ్యింది.

నాయిక, నాయకుని పర కాంతా సమాగమాన్ని గర్హించినట్లు గానే, నాయకుడు కూడా కాంత లెందరున్నా ప్రేమావృత పూర్ణమైన నాయిక సమాగమం కోసం పరితపించడంలో అవ్యాజ ప్రణయ బంధం ప్రస్ఫుటమౌతోంది.

మోహాతిశయం, నాయకుడు దూర ప్రాంతంలో ఉండడం చేత తన మనోగత భావాల్ని నాయిక ఇలా తన వారితో పంచుకుంటోంది.

పున్నాగ వరాళి – చాపు

ప॥ ఇందుకేమి సేతునమ్మా ఎవరు తోడి తెచ్చెదరమ్మా!

అ॥ ప॥ ఇందు వదన కడప వేంకటేశు డెంత దూరాన నున్నాడో

చ. 1॥ ఎక్కువ మోహమున నన్ను నేవేళ గౌగిట జేర్చువా
డొక్కడే పవ్వళించి యుండ నోపు నటవె
పక్క లోన వెదకి కానక ప్రాణేశుడెంత కలువరించెనో
మిక్కిలి విరహ వేదన చేత జక్కని సామికి మేనెంత చిక్కెనో

చ. 2 ॥ నెలతరో నాకెమ్మెవానక నిమిషమైన దాళలేడు
ఏలమి నా పొత్తునే కాని భుజియింప నీల్లుడు
తెలియనైతి మా యిద్దరి వలపు దృష్టి నాకె నమ్మలార
వలరాజు నన్ను బాధించినట్లనా చెలువుని నేడెంత వెతల బెట్టెనో

చ. 3 ॥ పడతిరో మువ్వ గోపాలుడైన కడప వేంకటేశుని గూడి
యెడ బాయక యాందునని యెంచుకొంటి
తడయకే నొకటి తలచితే దైవమొకటి దలచి నందుకు
తోడిబచినే తెగువ జేసిదనంటి తొయ్యలి వాడేమి జేసుకొనునే

నాయకుడు అమిత మోహాతిశయంతో తమకంతో కౌగిట జేర్చేవాడని, ఇప్పుడు తన పొందు లేక ఒంటరిగా ఎలా ఉండగలడని, తనతో పాటుగా నిత్యం భుజించే అలవాటున్న నాథుడు ఇప్పుడు ఒంటరిగా ఎలా తినగలుగుతాడని, తన చెలిమి లేని నాయకుని విరహాన్ని నాయిక ఊహించడాన్ని బట్టి నాయికకు నాయకునిపై గల గాఢ అనురక్తి మాత్రమే కాక, వారిద్దరి ప్రణయ బంధంపై గల అపారమైన నమ్మకాన్ని కూడా ఈ జావళీ తెలుపుతోంది.

“మిక్కిలి విరహ వేదన చెత చక్కని నా స్వామి మేనెంత చిక్కెనో” అనడం లోనిన్ ఆర్ద్రత రసరమ్యంగా ఉండి, ఈ విరహమే నాయిక పరంగా వర్ణించిన ఈ రచన చూడండి.

మధ్యమావతి – త్రిపుట

ఇంతే మోహము లేని దిపుడు తెలిసె గదరా

పంతగించి మువ్వ గోపాల రావైతివి

నీవు వచ్చిన మొదలు నిమిషమే యుగముగా
మా వనిత యొంటిగా మదిగుందుచు
భావమున దనుదానె పలుమారు నొచ్చుచు
ఈ వేళ దాక భుజియించకనె యున్నది

నెనరైన మమువంటి నెలతలతో చలుకక
కను మూసి తానొక గడియ నిద్రింపక
గొనబు సొమ్ము బెట్టక కొప్పు చుక్కమునక
మనసిజుని కాకచే గనలుచు నున్నది

వలచిన చెలి నెడబాసి యీరీతిగా
జలము జేసెదవు నవ్వుల కైన దొలుత
గలసిన వాడ విట్ల అలగిన దెల్ల మా
నెలత చేసిన పాప ఫలమేమో అకట

నిముషమే యుగంగా భావించడం, మదికుండడం, ఒక గడియ కూడా నిద్రించక పోవడం, ఒంటరిగా ఆహారం తీసుకోక పోవడం, మనసిజుని కాకచే బాధింపబడడం వంటి అవస్థల్ని వ్వర్ణిస్తూ, ఈ బాధలన్నీ నాయిక చేసిన పాప ఫలమని చెప్పడంలో తాత్త్వికత రచనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

ఈ జావళీలలో నాయిక ప్రాపంచిక విషయాల్నించి విడిపడి అతీతంగా స్వామి సాన్నిథ్యాన్ని కోరుతోంది.

బేహాగ్ – రూపక

సమయమిదే రారా నా సామి తామసించకురా

కమల వైరి చనుదెంచిన కాంక్ష లీడేరవుర

మగడు ఊరలేడు నా మామగారి జోలి లేదని
వగతెగ తెలిసినదిగా వట్టి వంతమేలర?

మన్ననచే నివు వచ్చి నన్ను గూడి యుండినట్లు
నిన్న రేయి కలగంటి నీరజాక్ష! వేంకటేశ!

అంటూ కలని నిజం చేయాలనే తపన లోంచి పారవశ్య వ్యక్తమౌతోంది. ఇంకొక జావళీలో –

ఖమాస్ – రూపక

అపుడు మనసు నిలుచునటే అతివరో ఇదేటి మాట

చపల మేటి కెటువంటి సామర్థ్యం కలవాడైన

చొక్కపు యౌవనము గల చక్కని పురుషుడు యువతుల
పక్క జేరి సరసముగా బల్కుచు కను సైగ జేయగ

వరద వేంకటేశ్వరుడిటు సురత కేళి సల్ప కోరిన
తరుణములో మారుడు విరి శరముల బిరబిర గురియగ

అంటూ నాయకుని రూప లావణ్యాలకు ముగ్ధయైన నాయిక తనకు కలిగిన మన్మథావస్థను చెలితో వ్యక్తం చేస్తోంది.

సురటి – రూపక

మరియాద తెలియకనే మాటలాడుట తగునటే

పరిహాసము జేయ తగిన వరుస కలిగి యుంటే నేమి

సరస సల్లాపములకు సమయము గాదే యేమె
సరసిజాక్షి నావంటి సతులు గుంపు గూడి యుండగ

వెలదిరో నన్ను గూడినట్లు వేంకటేశ్వరునిపై
బలవంతముగా నేను వలచి వచ్చినినానేమి

ఈ జావళీలో నాయిక మర్యాద లేకుండా మాట్లాడడం సరి కాదనే ఆవేదనను వ్యక్తం చేస్తోంది. మన్మథునికి తండ్రి అయిన వేంకటేశునిపై గల విరహానికి, అతని పుత్రుడైన మన్మథుడు సంధించే బాణాల బాధకు తాళలేక నాయిక నాయకుని చేయి నిమ్మని స్వాగతిస్తోంది. తండ్రి సమాగమాన్ని ప్రేరేపించే తనయుని బారికి తాళలేనంటోంది.

ఖమాస్ – రూపక

ప॥ ఏరా! రారా! చెయి తేరా! యీ మరుబారికి తాలగలేరా

అ॥ ప॥ మారజనక సుకుమార సుందర

చ.॥ 1. వలచి నన్ను బిలిచిన నన్ను సల్లాపించి
మరియు నుల్లసించవు

చ.॥ 2. సరసుడని నిన్ను కోరినార! బిరాన!
నన్ను కౌగలించవేర! వద్దకి

చ.॥ 3. పరమ దయాకరుడౌ శ్రీ ధర్మ పౌరాధిప
శ్రీ వేంకటేశ చేరను

అలాగే నాయకుని మౌనాన్ని నాయిక చైలితో ప్రశ్నిస్తోంది.

కల్యాణి – రూపక

ప॥ ఎంతటి కులుకే? ఇంతిరో కాంతునికివు

అ॥ ప॥ పంతము గల పరాంభోజ ముఖి పెనగినందు

చ.॥ 1. హొయలు మీరి వీధి లోన బయలు దేరి నన్ను జూచి
భయము లేక పాట పాడి కను సైగ జేయునే యిది

చ.॥ 2. యరకు లేక నిన్న రేయి ధరపురీశుడైన సామి
మరుని కేళి లోన నాతో మాటలాడ డేమిటి యిది

జార చోరుడనే పేరు కల నాయకుని స్వభావాన్ని నాయిక సోపపత్తికంగా చంత్కార యుతంగా సమర్థించే తీరులో సహజత్వం నిండిని ఈ జావళీని చూడండి.

సురటి – ఆది

ప॥ వారేమి జేసెదరే – ఊరి
వారేమి జేసెదరే – ప్రియుడు

అ॥ ప॥ జారచోరుడనే పేరైతే
జారచోరుడనే పేరైతే ఊరి

చ॥. 1. ఇంతిరో నీవిపుడు ఆడపేనమై కుల
కాంతలతో నేచితో ఎట్లోర్తురే ఊరి

చ॥. 2. నీరజముఖి వాడా రమణి మగని
తీరున పోయేడు నేరము లాడితే ఊరి

చ॥. 3. శ్రీకరుడగు శ్రీ ధర్మపురీశుడు
లోకాప కీర్తికి లోనైతే ఈ ఊరి

పర స్త్రీ సమాగమం కన్నా స్త్రీకి బాధాకరమైన విషయం ఇంకొక్కటి లేదు. నాయకుడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే బాధ, దరి చేరడం లేదనే ఆక్రోశం ఒక ఎత్తయితే, తనను మరచి, అన్య కాంతల్ని చేరాడన్న విషయం వల్ల కలిగే స్త్రీ సహజమైన మాత్సర్యం ఒక ఎత్తు.

ఈ రెండూ కలిసిన ఈ జావళీని చూడండి.

కేదారగౌళ – ఆది

ప॥ ఏరా తగునటరా సరిగాదురా

అ॥ ప॥ రారావు సేయకురా రాజ గంభీర

చ॥. 1. పర సతులతో పరిహాసము లాడుచు
మరి మరి నొప్పించెదవు ఎట్లు సైతురా

చ॥. 2. వర ధర్మ పురమున స్థిరముగ నెలకొన్న
వరదుడ మారుకేళిలో నన్ను గూడరా

ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన ప్రాణ సఖుడు రాకుండా మాయమై పోవడాన్ని నాయిక భరించలేక, ఇలా చేశాడేమిటే అంటూ బాధ పడుతోంది.

సెంజురుటి – ఆది

ప॥ ప్రాణ సఖుడిటు జేసెనే

చ॥ 1. ఇదిగొ వచ్చెదనని ఇతవులా
అల దానిల్లటు జేరెనే

చ॥ 2. వన విలుతుని కేళికి బిలిచితే వాడు
అనరాని మాట్లాడెనే

చ॥ 3. మును నన్ను కలిసి మర్మము లెరిగిన
ధర్మపురి వాసుడు నున్న

ఇలా ఎదురు చూస్తూ తన మనోగతాన్ని ఆవిష్కరిస్తోంది. నాయకుని కోసం తాను అన్నీ సిద్ధం చేసుకొని ఉంటే, రాకుండా ఉండడం నీకు మర్యాద కాదని చెప్తోంది.

బేగడ – చాపు

ప॥ ఇది నీకు మరియాదగా ఏరా నా సామి

అ. ప॥ ఇది నీకు మరియాదగా దానింటికి పోయి
అలసి సొలసి గూడి ఉందు రావైతి వయ్యో

చ.॥ 1. పెట్టె మంచము బిగి పట్టించి నా యెడ
కింద పవళించమని వేడితే నాతో
సద్దు సేయక మువ్వ సుదతి యింటికి పోయి
వట్టి నేలలో పవళించితి వయ్యో

పట్టె మంచాన్ని బిగించి పెట్టింది. ఇంటిలో పవ్వళించమని వేడుకొంది. కానీ స్వామి మౌనంగా సద్దు చేయకుండా తాను చూపిన సౌకర్యాలను కాలదన్ని అన్యకాంత ఇంట్లో వట్టి నేలపై పడుకున్నాడట. ఆ బాధకే నాయిక తాళ లేక పోతోంది.

అలాగే వేల వేల బాసలు చేసినా, కాళ్ళా వేళ్ళా బడి ప్రాధేయపడినా మాట వినకుండా, నాయకుడు వెళ్ళిపోయాడు. 

వసంత భైరవి – ఆది

ప॥ ఇంత రావు జేసితె నేనెటులోర్తునె

అ. ప॥ ఇంతి మువ్వ గోపాలుడు వింత దాని వలె నన్ను

చ. 1. మొదల వాడీడకు వచ్చి మ్రొక్కి పొంద వలనెన్న

సదయుడ వద్దు నేస్తమే చాలునంటినె

కదసి నా మాట వినక కాళ్ళ వేళ్ళ బెనగుచు

పది వేల బాసలు చేసి బాయ జాలననే వాడు

చ. 2. మనసు దెలియ వలసి మా యింటికి రావద్దన్న

కనుగొన దిటవు లేక కన్నీరు నించెనె

నీ ఎనకొన్న తమకాన పెదవులే దడవుచు

నిను బాయలేనని వెలత బ్రతిమాలినవా

చ. 3. నీ మాట నమ్మరాదోయి నే చాల గోప గత్తెను

ఏమన్న నేమి వచ్చునో ఎందుకుంటినె

మోము జూచి వాడు తన మోహమె పూటకావని

కోమలిరో మువ్వ గోపాలుడు నను గూడి 

ఆ స్వామి మీద వలపు చేత విరహాన్ని భరించడం నాయిక వల్ల కావడం లేదు. 

భైరవి – త్రిపుట 

ప॥ వలపు నిలువ నాదు వశము గాదేమి సేతు వనితరో ఈ వేళ

అ.ప॥ పొలతిరో మా మువ్వ గోపాల రాయడు చలము చేసినాడు

చ. 1. చలువ గంధము నిరుల సరము లేలేపొమ్ము లేలే

సాలపైన మీ సొగసు జూచే వారెవ్వరే

చెలియరో సేడది చెప్ప సక్కెము గాదు

వలపైన యీ పాపము వద్దే పగ వారికైన

చ. 2. చిలుక తేజీ పైనెక్కి చెలరేగి యెదురెక్కి

విలు గుణ ధ్వని చేసి విరి శరము బూని

కులుకు గుబ్బల నడుమ గురి జూచు చున్నాడే

అలరు విల్తుని బారి నార్చే వారెవ్వరిక  

చ. 3. సరసకు రాడాయె సరి ప్రొద్దు వేళాయె

విరహము మెండాయే వెన్నెల కాకాయె

మరుని కేళిలో నన్ను మువ్వ గోపాలుడు

సరసముతో పెనగి చౌక చేసినాడిక

పూర్వ జన్మల చేసిన పాపమే వలపయ్యిందట. ఎంత చక్కని భావం. “వలపైన యీ పాపము వద్దే పగ వారికైన” అంటోంది నాయిక. అంతే కాదు – తనను బాధించే మన్మథుని ప్రతాపాన్ని వర్ణిస్తోంది. చిలుక రథంపై మన్మథుడు వస్తున్నాడట. తన చెరకు వింటిని సంధించి గుణాన్ని లాగి శబ్దం చేస్తున్నాడట. అలా గుణక్వణనం చేస్తూ కులుకు గుబ్బల మధ్య బాణాన్ని ఎక్కు పెట్టటానికి సిద్ధపడి గురి చూస్తున్నాడట. అంతకు సాహసించిన మన్మథుని బారి నుండి నాయికను రక్షించే వారు నాథుడు తప్ప ఇంకెవ్వరుంటారు. 

అందుకే నాయిక నాయకుని దయ చూడమని, దయ చేయమని ఇలా ప్రాధేయపడుతోంది.

కల్యాణి – త్రిపుట

ప॥ ఏలా దయ నేల రానే నీకు పగదాన నటరా

అ. ప॥ చాలా వలచినాను రాజగోపాలా

చ. 1. చనువియ్యవు నాకింత చలమేలర నీకింత
ననువంటిది నీకు వింత గోపాలా

శ్రీనిధి మువ్వ గోపాల చెలుల తనను చాల
లాలించి యేలితి నీ లీల గోపాలా

తరితీవేల చేసేవు తగవా యింటికి రావు
కరుణతో నను జూడవు గోపాలా

కేదార గౌళ – అట

ప॥ ఏమి సేతురా ప్రాణేశ నేనెటువలె తాళుదురా

అ. ప॥ ఏమో కాని నిన్నెడ బాసినపుడె
ఈ మేన ప్రానము లేమిటికని తోచీ

చ. 1. ఒక మాటు నీ మోవానక ఒక పుస్తవు
జిహ్వకు జవిగాడు చేదయ్యీరా
మకురు మనసి నీతో మచ్చికై యున్నట్లు
వేనొక చోటను మోద మొంద నీయదెందు

చ. 2. నీ మాటలు వినవే కాని
వేరేమియు వీనుల కితవుగాదు
నీ ముద్దు మోము చూడనె కాని యితరము
కామింప నొల్లవు కన్ను లయ్యయ్యో

చ. 3. ఎలమితో మువ్వ గోపాల యిపుడు నిన్ను నా యెదపై
నలము కొన మన సయ్యీరా
చెలరేగి రతుల సెంతసేపుత్ కూడి
యలసిన తనివి తేరదెందు

తన కన్న చక్కని భామ ఇంకెవరున్నారని చెప్తూ అలక చాలించమని వేడుకుంటోంది.

ముఖారి – ఆది

ప॥ సామికి సరి ఎవ్వరి నా చక్కని

అ. ప॥ భామరో తిరువళ్ళూరి వీర రాఘవ

చ. 1. నెలతరో యెప్పుడైన నేనె చెక్కిలి జీరి
కలగి యెరుల లేకయే చెలియ జీరెనంట
తెలుగు కొమ్మను గాని యలగి మారు బలుకక
చలి యించని నిండు కుండ వలె నుండునమ్మ

చ. 2. కదసి నేనే వాని గంటి చేసి మరపున
వదరి యీ లాగుననే పడతి యుంచెనందునె
ఆదరిన కోపగించిన అలసిన సొలసిన
మదిరాక్షి రాచిత్తము సమ్మతి బరుచు నమ్మ

చ. 3. భామరో మా మువ్వ గోపాలుడే వీర రాఘవుడు
కాముకేళి హొయలుగ గలసి యుండగ
ఏ మగువ వద్దనైన యీలాగుందునో యంటి
ఈ మాటలెట్లంటినని యెంతో యుస్సురనెనమ్మ

నాయకుడు తన చెంత లేకపోవడంతో నాయిక తన మనోగతాన్ని విరహ తాపాన్ని వివరించమని చెలికత్తెను దూతగా నాయకుని వద్దకు పంపింది. అప్పుడు చెలికత్తె నాయకుని వద్దకు వెళ్ళి తిరిగి వచ్చింది. అలా వచ్చిన చెలిని తన ఉత్సుకతను ప్రదర్శిస్తూ నాయకునితో జరిగిన సంభాషణలను వినాలన్న కుతూహలంతో నాయిక చెలిని ఈ విధంగా ప్రశ్నిస్తోంది.

నాదనామక్రియ – ఆది

ప॥ ఏమనెనె సుద్దు లేమనెనే! బంగారు బొమ్మ

అ. ప॥ ఏమనెనే మరుగేల దాచకే
రామ తుపాకుల రాయడు నీతో

చ. 1. మానిని! ముందుగా నా మాట నీవెత్తితివో
తానె పలుకరించెనో దయ నాపయి గలిగి
కానుక తన చేత బూనెనో యందిమ్మని
యానతీవే నా మీదాన యో చెలియ

చ. 2. వనితరో! వాడీడకు వచ్చెననెనో లేక
నను తోడి తెమ్మనెనో నా ప్రాణ విభుడు
నెనరుతో మాటాడనో నేరమించెనో లేక
వినుపింపు వాని మాట విన ముచ్చటయ్యేని

చ. 3. వేడుక దుపాకుల వేంకట కృష్ణుడు
గూడే వేళలో నే వోడితినని
నేడా సుద్దు లేమైనా నీతో మందలించెనో
మోదిగా నున్నాడో ముదితరో యేమె

ఓ మానినీ! నువ్వే ముందుగా నా గురించి నాథునికి చెప్పావా? లేక నాపై దయ కలిగి తానే పలకరించాడా? అని ప్రశ్నించడాన్ని బట్టి నాయిక విరహ తాపం తెలుస్తోంది. అంటే నాయకునికి తాను గుర్తున్నానా? లేనా? తన చెలికత్తెను చూడగానే, తానే పంపానన్న విషయం స్వామికి అర్థమయ్యిందా లేదా? అనే సందేహాలు నాయకునిపై నాయికకు గల ప్రేమాతిశయాన్ని తెలియజేస్తున్నాయి.

నాథుడు ఇక్కడకు వస్తాడా? లేక నన్నే అక్కడకు రమ్మన్నాడా? నాలో నేరాల్ని ఎంచుతున్నాడా? మన్నించాడా? ఏం జరిగిందో చెప్పు. నా నాథుని ముచ్చటలు వినాలని మనసు ఉవ్విళ్ళూరుతోందనే నాయిక లోని భావావేశం చక్కని మాటలలో సులభంగా అలతి అలతి పదాలలో వర్ణించబడింది.

ఈ ప్రశ్నలకు చెలి చెప్పిన సమాధానం.

భైరవి – త్రిపుట

ప॥ అలగితి వెందుకు అల మువ్వ గోపాలునితో
ఆయాయపోవే

అ. ప॥ నెలతరో నీవంటి నిర్దయురాలను
యిలనెందు గాన యిది యేమి వానిపై

చ. 1. భామరో! నీ మది కేమి దెలుపుదు
కోమలాంగుడు నిన్నె కోరి యుండగను
వేమారు నీవేమొ వేడి నావనినాడు
నోము ఫలమని నొచ్చు కొన్నాడట

చ. 2. వలువ చక్కెర పురి నిలయుని మదిలో
వల వేసి నను వలపించ లేద
కళలూర రతి కేళి కలసిన పిమ్మట
చెలువుడ నీ పొందు చాలు పొమ్మని

చ. 3. ఎనసిన వానిపై కినుక సేయుట నీకు
మనసి యెటువలె వచ్చెనె మానవతిరో
నెనరు గల దానవని నీ విభుడు యిందు రాగానే
వనజాక్షిరో వాని వలపు లారడి జేసి

నాయిక నిర్దయగా నాయకునిపై కినుక వహించిందట. ఇక్కడ చెలియ కూడా నాయకుని పక్షాన్నే నిలిచింది. ఆ కినుకకు కారణాన్ని కూడా చెలి వివరిస్తోంది.

ముఖారి – ఆది

ప॥ పలుకరించిన గాని పలుకక పొయ్యేవు
పడతి నీ గర్వమేమే

అ. ప.॥ తలచిన వేయారు తరుణుల చేకొన్న
కలిగి గోపాలు చనవలె నటీ నా పేరు

చ. 1. తియ్యని కెమ్మైని తేనెలానగను సయ్యాటల
ప్రొద్దు జరుప నోపవా
పయ్యదను తొలగించి పాలిండ్లపై నొక్క
చెయ్యి నేనటు వెయ్య నిచ్చెదనా

చ. 2. మోము మోమున జేర్చి ముద్దు పెట్టుచు నీవు
వేమారు నన్ను నవ్వించ నోపుదువా
భామరో యొకసారి పలుకులు పలుకుచు
ప్రేమతో రామన్న పిలుప పంపెదవా

చ. 3. ఎక్కువగా నన్నేలుకొమ్మన్న గ్రక్కున
గళబంట కౌగలించెదవా
మక్కువ తోడుత మువ్వ గోపాల రమ్మని
యొక్కసారైన నను నుండనిచ్చెదవా

నాయకుడు పలకరిస్తే నాయిక పలకలేదట. నీకెందుకింత గర్వమని చెలి నాయికను మందలిస్తోంది. నాయిక సమాగతుల కోసం వచ్చిన నాయకుని తిరస్కరించడం తగదని చెలి చెప్తోంది. ఈ అలక, కినుక, ప్రణయ కేళిలో మామూలే. “వజ్రం వజ్రేన భిద్యతే” అన్నట్లుగా అలకకు అలకే మందు. అలకలు లేని ప్రణయం తావి లేని పువ్వుతో సమానం కదా! అందుకే అలక మాని నాయకుని రమ్మని వేడుకుంటోంది నాయిక.

(To be continued in Part 2)