జావళీ అనేది నాయికా నాయక భావంతో కూడిన శృంగారాత్మక రచన అనే విషయం పూర్వాధ్యాయాల ద్వారా విదితమే. అయితే ఆంధ్ర సాహిత్యంలో వాగ్గేయకారులు గావించిన పద రచనే దీనికి మూలమని చెప్పవచ్చు.
శృంగార రస భావాదుల తోనూ, నాయికా నాయకుల సమాగమాది విశేషాల తోనూ, క్వాచిత్కంగా సంభోగ శృంగార విషయాల్ని పొందుపరచు కున్నప్పటికీ జావళీలు భగవత్పరంగా ఐక్యతను పొందాయి.
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుడు, క్షేత్రయ్య రచించిన పద రచనా మాధురీ మహిమలే జావళీల్ని మరింతగా గుబాళింప జేశాయని చెప్పవచ్చు. వారు ప్రారంభించిన ఈ శృంగార రస ప్రధానమైన పద రచన జావళీ ఆవిర్భావానికి నాంది పలికిందని చెప్పవచ్చు.
ఆ తరువాత, కాలానుగుణంగా వచ్చే మార్పుల ఆధారంగా దాసకూటాలనే పేరుతో మరి కొంతమంది ఈ పద సాహిత్యాన్ని కేవల లౌకిక శృంగారాత్మకంగా సాగించారు. అలా ప్రారంభమైన కేవల శృంగార స్వరూపమే కళ్ళకు కట్టినట్లు ఆధునికులకు గోచరించింది. అందువల్ల ‘జావళీ’పై సరైన అభిప్రాయం లేదు. సదభిప్రాయం కోల్పోయిన ఆధునికులు జావళీలపై చులకన భావాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం పచ్చి శృంగారానికే ప్రాధాన్యమిచ్చిన రచనలుగా దుయ్యబట్టారు. వీటిలో ప్రస్తావించిన అంశాలేవీ లేదని భావించారు.
కానీ జావళీ సాహిత్యం తెలుగు సాహిత్యానికే కాక, ఆధునికంగా వస్తున్న సాహిత్యానికి కూడా ఎంతో మేలు చేసింది. గేయాత్మక ప్రక్రియల్లోకి జావళీ శర వేగంతో దూసుకు పోయి తన ప్రభావాన్ని చూపింది.
ఇదే వేగంతో సినీ సాహిత్యంలో కూడా ప్రవేశించింది. సినీ రంగం లోకి జావళీ ప్రవేశించడం తోటే సినీ సాహిత్యంపై జావళీ తన ప్రతిభా వంతమైన ప్రభావాన్ని చూపింది. ఆ ప్రభావానికి లోనై ఎన్నో సినిమా పాటలు జావళీల ఆధారంగా వెలుగు చూశాయి. అన్ని లక్షణాలు కల జావళీలు తెలుగు చలన చిత్ర సీమలో యథాతథంగా చిత్రీకరించబడి వాటి ప్రాధాన్యతను నిలబెట్టుకున్నాయి.
జావళీ రాగ తాళాలతో కూడిన పాట. తెలుగు సాహిత్యంలో ఎక్కడో, ఏ కొన్ని సందర్భాలలోనే తప్ప, సంగీతం, సాహిత్యం కలసిన సందర్భాలు తక్కువ. సాహిత్యం లోని పద్యాలన్నీ ఛందో భూమికపై సాగిపోతాయి. లేకపోతే మాత్రా గతుల పైనే ఆధారపడి ఉంటాయి. కానీ సశాస్త్రీయమైన సంగీతం ప్రాచీన సాహిత్యానికి అవసరం అంతగా ఉండదు. అందువల్ల జావళీ ఉనికి ప్రశ్నార్థక మయ్యిందని భావించవచ్చు. ఎప్పుడైతే భారత దేశంలో సినీ రంగం ప్రఏశించిందో, సరిగ్గా అప్పుడే జావళీ సంగీతంతో పాటుగా మళ్ళీ వెలుగు లోనికి వచ్చింది.
ప్రధానంగా సినిమా నిర్మాణంలో సంగీత సాహిత్యాల సమ్మేళనం ఉంటుంది. నాయికా నాయకుల శృంగారం వర్ణించే సందర్భాలు, విరహాన్ని వర్ణించే సన్నివేశాలు తప్పని సరిగా కథా భాగంలో ఉంటాయి. అంతే కాకుండా సినిమా సామాన్య ప్రజలకు ఉద్దేశించి నిర్మించేది కాబట్టి వారు అందించబోయే చిత్రం సాధారణ వ్యక్తికి ఉద్దేశించినదన్న విషయం వారికి ఎప్పుడూ గుర్తుంటుంది.
అందుకోసం భాష ఎంతో సరళంగా ఉండాలి. కథాంశంతో పాటు సంగీత ప్రధానమయిన పాటలు ఉన్నప్పుడే ఆకర్షణ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉంటేనే కదా సినిమా ప్రజాదరణ పొందేది. సరిగ్గా ఈ లక్షణాలన్నీ జావళీలలో ఉండడం వల్లనే, జావళీలు అత్యంత వేగవంతమైన రీతిలో సినిమా సాహిత్యం లోనికి ప్రవేశించి, ఆయా సినీ రచయితల చేత కొంగ్రొత్త జావళీల్ని రచింప జేసిన ఘనతను వహించాయి.
జావళీలు సంగీత శాస్త్రాన్ని అనుసరించి, రాగాలతోనూ, తాళాలతోనూ సమ్మోహన పరిచేవిగా రూపొందాయి.
ప్రధాన రసం శృంగారం. నాయికా నాయకుల మధ్య జరిగే ముచ్చట్ల దగ్గర్నుండి మూతి విరుపుల దాకా, కంటి సైగల నుండి కన్నీటి బిందువుల దాకా ఎన్నో మనసుకి నచ్చేవి, మనసు మెచ్చుకొనేవీ అయిన సంఘటనలు ఉంటాయి. వాటిని చూసి ప్రేరేపితులైన రచయితలు ఆ సందర్భాలలో సన్నివేశ గీతాలు రస పుష్టిని పొందాలనే భావంతో అవే రాగ తాళాలను అనుసరిస్తూ కూడా జావళీ రచనలు చేశారు. ఈ నేపథ్యం కారణంగా తెలుగు సినిమాలపై జావళీల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇలా రచించిన జావళీలు ప్రేక్షకుల హృదయాల్ని కదిపాయి. అశేష ఆదరణకు పాత్రమయ్యాయి.
జావళీల ఆవిర్భావ వికాసాల కాలం క్రీ.శ. 1450 నుండి 1920 ప్రాంతాల దాకా సాగిందని నిర్ణయించవచ్చు. ఈ కాలంలో దక్షిణ భారత దేశమంతా అధిక ప్రాచుర్యాన్ని పొంది, బ్రిటిష్ పాలకుల్ని సైతం ఆనంద పరవశుల్ని గావించిన ‘జావళీ’ 20వ శతాబ్ది ప్రాంతంలో ఆనాటి ఉదాత్తతనీ, ఔన్నత్యాన్నీ కోల్పోయి సరైన స్థానం లభించక పోవడంతో సినీ గేయ రచయితల చేతిలో పడి వేశ్యలు పాడే గీతాలలో చోటు సంపాదించింది.
దీని ప్రభావం పరిశోధకులపై పడింది. జావళీలు అనగానే కేవలం వేశ్యల కోసం రాసిన గీతాలుగా రూఢి అయిపోయాయి. జావళీ రచయితలు అదృశ్యం అయిపోయారు. ప్రజానురంజకంగా ఉండేడట్లుగా జావళీని ఆధునిక కవులు మార్చి వేశారు.
ప్రారంభంలో జావళీ ప్రభావంతోనే సినీ పాటల రచన ప్రారంభమయింది. జావళీలలో గల స్వర కట్టును అనుసరించి తెలుగు, తమిళ సినిమాలలో పాట ప్రవేశించింది.
తెలుగు సినిమాలలో ప్రారంభ దశలో జావళీల్ని అనుసరిస్తూ రాసిన కొన్ని సినిమా పాటలున్నాయి. ఉదాహరణకి:
- “సరసము లాడేటందుకే” హిందుస్థాని కాఫి రాగంలో గలజావళీకి అనుసరణగా వెలసిన “పిలచిన బిగువట రా” అనే గీతం మల్లీశ్వరి చిత్రంలో ఉంది.
- “అపదూరుకు లోనైతినే” అనే ఖమాస్ రాగంలో గల జావళీకి అనునరణాత్మకంగా సాగిన “చాలు చాలు నవ మోహనా” అనే పాట కాళహస్తీ మాహాత్మ్యంలో ఉంది.
అలాగే తమిళ సినిమాలలో కూడా జావళీ ప్రక్రియ ప్రభావానికి లోనై చిత్ర గీతాలు వెలువడ్డాయి. ఉదాహరణకి:
- “చెలి నేనెట్లు సహియింతునే” అనేఫరజ్ రాగంలో గల జావళీకి సినిమా స్వరకట్టు “మరవనే ఎన్నాలీళుమే గిరిధారీ ఉనదెరులే‘
- “ఏల రాడాయనే” అనీ భైరవి రాగంలో గల జావళీకి సినిమా స్వరకట్టు “ఉన్నై కండు మయంగాద పేర్గళుండో”
వంటివి.
తదుపరి వచ్చిన కొన్ని సినిమా పాటలు జావళీలలో గల పల్లవి ఆధారంగా చేసుకుని సొంత సాహిత్యంతో సినీ రచయితలు రచించారు.
దాసు శ్రీరాములు గారి జావళీ –
ప॥ ఏమనెనే కోమలీ తెలుపవే నీతో ఏమనెనే కోమలి
ఈ జావళీని అనుసరిస్తూ సముద్రాల “షావుకారు” (1950) చిత్రంలో ఒక పాటను రచించారు.
“ఏమనెనే చిన్నారి ఏమనెనే
వన్నెల సిగపూవా కను సన్నలలో భావమేమె
ఆమని కోయిల పాటల
గోముల చిలికించు వలపు కిన్నెర
తానేమని రవళించెనే?
వనరుగా, చనువైన నెనరుగా,
పలుకె బంగారమై, కులుకె సింగారమై
మావాడ రాచిలుక
మౌన మౌనముగా ఏమనెనే” (5)
ఈ పాటలో “ఏమనెనే” అనే నాలుగక్షరాల ప్రశ్నను జాగ్రత్తగా వింటే, ఈ నాలుగక్షరాల ప్రశ్న నాలుగు సార్లు వస్తుంది. వస్తూ వస్తూనే, మొదటి సారి కుతూహలాన్నీ, రెండో సారి ఆందోలనని, మూడో సారి బుజ్జగింపునీ, నాలుగో సారి ఆత్రుతనీ స్ఫురింప జేస్తుంది. మనోహరంగా ఉన్న ఈ భావానికి ప్రభావం జావళీ రచనే.
“రమణిరో సముఖాన రాయబార మేటికో
నిముషమైన తాళలేను నేనే వాని రమ్మందునే”
అనే జావళీ శ్రీ దాసు శ్రీరాములు గారు రచించారు. ఆ జావళీ స్ఫూర్తితో వచ్చిన ఈ సినిమా పాటను చూడండి.
“పలుకరాదటే చిలుకా పలుకరాదటే
సముఖములో రాయబార మెందులకే”
చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై రచించిన ‘మధురా నగరిలో‘ అనే జావళీని “త్యాగయ్య” సినిమాలో కూచిపూడి భాగవతులు పాడుతూ అభినయించినట్లుగా యథాతథంగా స్వీకరించి చిత్రీకరించారు.
ఈ జావళీని “త్యాగయ్య” రెండు చిత్రాలలో పల్లవి వరకూ వాడుకొన్నారు.
అలాగే “అభిమానం” చిత్రం లోనూ, భరణి వారి “ప్రేమ” చిత్రం లోని హాస్య గీతం లోనూ, “పతిభక్తి”లో పల్లవి మినహా మిగతా పాటనూ, “సిరిమువ్వల సింహనాదం”లో రేఖా మాత్రం గానూ ఉపయోగించడం విశేషం.
“జీవిత నౌక” చిత్రంలో “మధురా నగరిలో” అనే జావళీ స్ఫూర్తితో రచింపబడిన ఒక గీతం వెలువడింది.
“చల్లలమ్మే భామనోయి
పల్లెపట్టు లేమనోయి
అత్త చాటు పిల్లనోయి
దారి విడువు కృష్ణయ్య – నా”
అంటూ డా॥ సి. నారాయణ రెడ్డి గారి రచన హృద్యంగా సాగింది.
“ఆకాశ రాజు” చిత్రంలో
“చిలుక చూడరా మిన్నులలో
ఎగిరి పోయె బాలా
జాణతనాన గడుసుదనాన
మధురా నగరిలో చల్లనమ్మ బోదు
దారి విడుము కృష్ణా కృష్ణా…”
అనే పాట. దీనితో పాటుగా వాహినీ వారి “భక్త పోతన” చిత్రంలో
“మంచి సమయము రారా ఇది
చలమేల చేసేవురా
నిన్నే కోరి నీకై నిలచితిరా
రారా కోరిక దీర మనకిది”
అంటూ బెజవాడ నాగరత్నం గారు కల్యాణి రాగంలో పాడిన ఈ పాట కూడా జావళీ ఛందస్సులోనే వెలువడింది. దీని కర్త సముద్రాల. దీనికి ఆధారభూతంగా నిలిచింది ఒక సారంగపాణి పదమే. దానిని చూడండి.
(To be continued… Last edited 16 Feb 2026)