నా మాట

1963 నాటి సంగతి. మద్రాసులో “సంగీత విద్వాన్” టైటిల్ కోర్సు “సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్” లో చేస్తున్న రోజుల్లో మొట్టమొదటి సారిగా “మరియాద తెలియకనే” అఏ సురటి రాగంలో జావళీ విని చాలా ముగ్ధురాలనయ్యాను. కర్ణాటక సంగీతం అంతా ఒక ఎత్తు, జావళీ ఒక ఎత్తు అనిపించింది. నాకు సంగీతమయినా నేర్చుకోవడం తేలిక అనిపించింది కాని జావళీ నేర్చుకుని పాడలేకపోయాను.

అదే కాలేజీలో గాత్రం నేర్పుతున్న శ్రీమతి టి. బృంద, మా కోర్సులో ఉన్న నాలుగు జావళీలను నేర్పించారు. “ఎంతటి కులుకే”, “సమయమిదె రారా”, “ముట్టవద్దురా”, “పారిపోవలెరా” అనే జావళీలు నన్ను ఎక్కువగా ఆకర్షించాయి. ఆ రెండు సంవత్సరాలు ఎన్ని కీర్తనలు, వర్ణాలు, రాగం పాడడం, స్వరం వేయడం, నెరవల్ పాడడం నేర్చుకున్నా – నాకు జావళీలు నేర్చుకోలేక పోతున్నాననే దుగ్ధ పట్టి పీడించేది. ఆ కోరిక తీరకుండానే విద్వాన్ పూర్తి చేసుకుని మద్రాసు నుండి వచ్చేశాను.

ఆ జావళీలు నేర్చుకోవాలనే నా అభిలాష తీరే అవకాశం 1989-91 సం॥లో లభించింది. ఆంధ్రా యూనివర్సిటీ వారి ప్రకటనను చూచిన నేను “పార్ట్-టైం” పరిశోధన కోసం దరఖాస్తు చేసిన నాకు శ్రీమతి మలయవాసిని గారు పర్యవేక్షకురాలిగా లభించడం నా అదృష్టం కంటే “జావళీ” అదృష్టం అంటే ఎక్కువ ఆనందం నాకు.

నేను సంకోచిస్తూనే “జావళీ” పరిశోధనాంశంగా తీసుకోవచ్చా అని శ్రీమతి మలయవాసిని గారిని అడగ్గానే ఆమె ఎంతో ఆనందంగా అంగీకరించారు. కారణం ఆమెకు గల సంగీత జ్ఞానం, రస హృదయం, జావళీ అంటే గల సదభిప్రాయం, జావళీ వింటూ ఉప్పొంగే హృదయం. ఇలాంటి కళా హృదయం ఆమెక్కు ఉండడమే దానికి కారణాలు. సంగీతంలో “సంగీత విద్వాన్”, తెలుగు సాహిత్యంలో “ఎం.ఏ” పట్టా కలిగిన నేను ఈ “జావళీ” పరిశోధనకి తగిన దాన్నిగా స్వీకరించారు. అర్హతలన్నీ నాకున్నాయని, రాగాలు, తాళాలు, భావ స్ఫూర్తి, పాడగల లలితమైన కంఠం, అన్నీ కలిసిన ప్రక్రియ జావళీ నా చేతిలో న్యాయం పొందుతుందని బహుశః ఆమె భావించి ఉండవచ్చు.

(To be continued … Last edited 4 March 2026)