6.4 నాయక లక్షణాలు

ప్రాచీన సంప్రదాయ కవిత్వంలో నాయకుని లక్షణాల్ని పర్ణించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సత్ప్రయోజనాన్ని పొందవలసిన కావ్యంలో అందరికీ ఆదర్శప్రాయంగా ఉండవలసిన నాయకుల లక్షణాల్ని భారతీయ అలంకారికులు ప్రయోజనాత్మికమైన దార్శనిక దృక్పథంతో రూపొందించారు.

నాయకులను పర్ణించే సల్లక్షణాలు అందరికీ పార్గదర్శకం కావాలనేదే ఈ వర్ణనల వెనుక ఉన్న మహదాశయం.

స్వభావాన్ని బట్టి లక్షణాత్మకంగా నాయకులు నాలుగు విధాలుగా విభజింపబడుతున్నారు.

1. ధీరోదాత్తుడు:

ధీరత్వం, ఔదార్య గుణాలు ప్రధానంగా కల లక్షణాలు కల నాయకుడు ధీరోదాత్తుడు.

లక్షణాలు:

  1. తనను తాను పొగడుకోక పోవడం (ఆత్మస్తుతి చేసుకోనివాడు)
  2. సర్వ ప్రాణుల మీదనూ అవ్యాజమయిన దయా రసాన్ని కురిపించేవాడు.
  3. విశేషమైన ధైర్యం కలవాడు
  4. అపారమైన ఓర్పు కలవాడు
  5. సుఖ దుఃఖాల్ని సైతం లెక్క చేయనటువంటి, వేటికి వశం కాని స్వభావం కలవాడు
  6. భయం, క్రోధం, శోకాదుల ప్రభావానికి లోనుకాని లక్షణం కలవాడు
  7. విధేయతచే దాచబడిన గర్వం కలవాడు

ఇలా ధీరోదాత్త లక్షణాల్ని అలంకారికులు పేర్కొని లక్షణ లక్ష్యాత్మకంగా సాధించారు.

2. ధీరోద్ధతుడు:

ఉద్ధతమైన ధీరత కలవాడు ధీరోద్ధతుడు.

లక్షణాలు:

  1. శౌర్యం కలవాడు
  2. డాంబికం, మాయ వంటి లక్షణాలు కలవాడు
  3. కఠినమైన హృదయం కలవాడు
  4. స్థిరత్వం లేక నిత్య చాంచల్యమాన మయిన ఆలోచన కలవాడు

ఈ లక్షణాలు కలవాడు ధీరోద్ధతుడు.

3. ధీరశాంతుడు:

సాత్త్వికమైన లక్షణాలు ధీరత్వంలో మిళితమై ఉండే లక్షణాలు కలవాడు.

లక్షణాలు:

  1. శమదమాది గుణాలకునిలయమై, వాటిని నియ్తం పోషించేవాడు
  2. బ్రాహ్మణ భక్తి హృదయంలో నిత్యం వహించేవాడు

పూర్తిగా ఈ లక్షణాలతో శంతిమయ జీవనాన్ని ఆకాంక్షించేవాడు ధీరశాంతుడు

4. ధీరలలితుడు:

ధీరత్వంతో కూడిన లాలిత్యం, కళా హృదయం కల సున్నిత మనస్కుడు.

లక్షణాలు:

  1. కళాసక్తి కలవాడు
  2. లాలిత్యం కలవాడు
  3. కస్తూరి కర్పూర వీటికాది అనుపమ చందనాగరు వస్త్ర భూషణాలంకార యుతమైన వాడు
  4. సమ్యగ్భోగాసక్తుడు

ఈ లక్షణాలు ధీరలలితునిలో ఉంటాయి.

ఈ లక్షణాలు కల నాయకులే కాక శృంగార నాయకులు కూడా నాలుగు విధాలుగా ఉంటారని భారతీయాలంకార శాస్త్రం పేర్కొంటోంది.

  1. దక్షిణుడు
  2. అనుకూలుడు
  3. ధృష్టుడు
  4. శఠుడు

దక్షిణుడు:

అనేక నాయికలపై మక్కువ కల శృంగార పురుషుడు

లక్షణాలు: ఒక కాంతకు భుజాపరిరంభాన్ని, వేరొక సతికి ముఖాన్ని, మరొక భామినికి కరాన్ని యిచ్చి, అనేక నాయికలతో భోగించి, ఆనందించే లక్షణాలు కల నాయకుడు.

అనుకూలుడు:

ఒక్క కాంతనే వలచి, అనుల్కూల్యంగా ప్రియానురాగాన్ని అనుభవించే నాయకుడు.

లక్షణాలు:
కనకాంబరాల్ని, ఉజ్జ్వలమై, దివ్యమైన రత్నాలతో కూడిన సుందరమైన ఆభరణాలనూ, ఘనసార సుగంధాదులను ఇచ్చి, దంత క్షత, నఖ క్షత, చుంబనాలింగన బంధనాలతో ఒక్క సతితోనే సమాగమించి ఆనందించే లక్షణం కలవాడు.

ధృష్టుడు:

దక్షిణ, అనుకూల నాయకుల కంటే కొంచెం టక్కరి.

లక్షణాలు:
నాయకుడు వేరే కాంతలతో సమాగమించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ విషయాన్ని తెలియ జేసే చిహ్నాలున్నప్పటికీ, దానిని అంగీకరించక తప్పించుకొనేవాడు.

శఠుడు:

పరిపూర్ణమైన హృదయాన్ని పంచి ఇవ్వనివాడు.

లక్షణాలు:
ఒక నాయికపై అపేక్ష కలిగి ఉండడం వల్ల వేరొక నాయికను సమాదరించడు. ఇతడు నాయికతో ప్రత్యక్షంగా మాట్లాడతాడు గానీ, అతని దృష్టి అన్యకాంత పైనే ఉంటుంది. కన్నులతో చూస్తాడు, కానీ మనసుతో చూడడు. పైపై మాటలతో మాత్రమే నాయికకు తృప్తిని కలిగిస్తాడు కానీ భావంతో కాదు.

ఇక్కడ పేర్కొన్న ధీరోదాత్త, ధీరోద్ధత, ధీరశాంత, ధీరలలితులనే నాయక లక్షణాల్నీ, దక్షిణ, అనుకూల, ధృష్ట, శఠలనే శృంగార నాయకుల లక్షణాల్నీ జావళీ కర్తలు వాడుకున్నారు.

నాయిక నాయకునిపై గల విరహావస్థను, చెలికి వివరించే సందర్భంలో నాయకుల స్వరూప స్వభావాల్ని, వారి లక్షణాల్ని తలబోస్తూ పేర్కోవడం ఇక్కడ అధికంగా కనిపిస్తుంది. ధీరోదాత్త, ధీరలలితాది లక్షణాలు కల నాయకుల్ని జావళీలలోని నాయికలు ఆకాంక్షించారు.

ధృష్ఠుడు, శఠుడు వంటి శృంగార నాయకుల చేష్టలవల్ల ఎంతగానో బాధపడ్డారు. అనుకూల నాయకుడై, స్వామి నిత్యాం వాళ్ళతో కూడి ఉండాలనే స్త్రీ మానసాన్ని ప్పుంఖానుపుంఖాలుగా భావ బాహుళ్యంలో ప్రదర్శించారు.

జావళీలలోని నాయకులు ప్రేమతో స్వార్థాన్ని నింపుకున్నవారు. స్వార్థం మానవతకు కళంకం. కానీ శృంగారంలోనూ, ప్రేమలోనూ స్వార్థం అతిశయాన్ని తెలియజేస్తుంది. అనేక స్త్రీలతో రమించే నాయక లక్షణాల్ని నాయికలు జీర్ణించుకోలేకపోయారు.

తనను విడిచి నాయకుడు అన్యనాయిక పొందు కోసం వెళ్ళిపోయాడని, ఇంకా రావడం లేదని, వెళ్ళి వెంటనే తీసుకుని రమ్మని చెలిని పంపే ప్రయత్నం చేస్తూ హృదయావేదనను వ్యక్తం చేశారు.

ఇది ప్రాచీన సమాజంలో బహుముఖీనంగా వ్యాపించి ఉన్న వాస్తవ పరిస్థితులకు అక్షర రూపం.

భారత దేశంలో, ముఖ్యంగా రాచరిక వ్యవస్థలో నాయకుడు స్వీయ భోగాపేక్ష కోసం, అనేకులయిన నాయికలని ఉపయోగించడం కనిపిస్తుంది. నాయకునిలో ఉన్న ఈ బహునాయికా పోషణ అనే గుణం ఆనాటి పురుష వ్యవస్థ భోగాలాలసతకు అద్దం పట్టినా, స్వీయ లాభం కోసం స్వేచ్చ లేని స్త్రీ జీవితాలకు జావళీలు యధార్థ సాక్ష్యం.

అంతులేని కోరికెలు తీరే మార్గం లభించక పోవడంతో స్త్రీలు ఊహా మార్గాల్లో విహరించడం, ప్రియుని సమాగమ విషయాల్నే పదే పదే స్మరించుకుంటూ కాలం గడపడం, తనను నిర్లక్ష్యం చేసి, అన్య కాంతాసక్తుడయిన నాయకుని నిందించడం, ఒక్కోసారి ప్రాధేయపడడం, మళ్ళీ మళ్ళీ ఆ సాహచర్యం కోసం పరితపించడం, అందుకోసం మార్గాల్ని అన్వేషించడం… ఇవన్నీ సంక్షోభంలో కూరుకున్న స్త్రీ సమాజపు మానసిక పరిస్థితికి గీటురాయిగా చెప్పవచ్చు.

ఈ లక్షణాలన్నీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే సరిగ్గా సరిఫొవచ్చు. కానీ యథార్థంగా ఉన్న ఝీవితాన్ని సమాజంలో కామ స్వేచ్చ లేని స్త్రీల బాధల్నీ వ్యక్తీకరిస్తూ, అదే సమాజంలో వేరే ప్రవాహంగా సాగిపోయే ఆధ్యాత్మికతకు జంటగా మేళవించి రచించడం ద్వారా అటు సామాజిక పరమైన వ్యక్తీకరణ, అధ్యాత్మిక పరమైన ఆశయాభిలాష, రెండూ జంట ప్రవాహాలుగా సాగిన తీరు జావళీలలో కనిపించడం ఆశ్చర్యకరం.

విశ్లేషాణాత్మకంగా పరిశీలిస్తే సాహిత్యం సమాజం లోతుల్ని పట్టుకొని, ఏ విధంగా నమోదు చేయ గలదనేందుకు ఇంతకంటే సాహితీ సాక్ష్యాలు ఇంకేం కావాలి?

ఒక ప్రక్రియ, మరొక ఉద్యమం, ఇంకో భావప్రవాహం ఉవ్వెత్తున ఎగిసి ఉద్ధృత రూపాన్ని సంతరించుకుంటుందంటే వాటి మూలాలు ఎక్కడో పసిగట్టలేని మార్మిక స్థితిలో అట్టడుగున సూక్ష్మాంశంగా ఉంటుందనేది అందరూ అంగీరకించవలసిన విషయం.

జావళీలు భిన్న ప్రక్రియలుగా రూపు దాల్చడమే కాక, శృంగారపరమైన ముఖంతో వెలుగు చూస్తున్నాయంటే వాటి ఆవిర్భావానికి గల మూలాల్ని పరిశీలిస్తే గానీ వాటి అసలు విషయం బహిర్గతం కాదు.

ప్రాచీన సమాజం లోని స్త్రీల అంతర్గతం, నాటి వ్యవస్థలు, స్త్రీ పురుషుల శృంగార పరమైన పరిమితులు, పరిధులు, వాటిలో ఎక్కువగా స్వార్థ ప్రయోజనాల కోసం రూపొందించుకొన్న పురుషుల ఆధిపత్యం, ఇవన్నీ ఒక ఎత్తుగా కనిపిస్తాయి.

వేదాలు నడిచిన దారిలో నడిచే ఈ భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతి విషయం లోనూ తాత్త్వికతనూ, ఆధ్యామిత్మకతనూ దర్శింపజేస్తూ, సమాజానికి, మానవాలోచనలకి ఒక చెలియలికట్టను ఏర్పాటు చేశాయి. చివరికి శృంగారాన్ని కూడా ఆధ్యాత్మికంగా దర్శించాలనే వారసత్వాన్ని మనకి అందించాయి.

అందుకే జావళీలలో శృంగారం వర్ణించినా, నాయికా నాయక్కులు శృంగారాధి దేవతలయిన రతీ మన్మథుల్లాగా సాక్షాత్కరించినా సమాజాన్ని పక్క దారి పట్టనివ్వని ఒక ప్రగతి శీల భావ ధోరణి నాటి సాహిత్యానికి ప్రధాన భూమికగా ఉండడం వల్ల ఆ శృంగారం మొత్తాన్ని భగవత్పరం చేసి, దాన్ని ఆధ్యాత్మికంగా ముడి వేశారు. నాయిక నాయకుని పొందు కోసం పరితపించడం, దాని కోసం ప్రయత్నం చేయడం, ఆ ఆలోచనలలోనే గడపడం ఇవన్నీ కూడా భక్తికి కూడా ఆపాదించుకోవచ్చు.

జీవుడు పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందడం కోసం అనేక రకాలుగా పరితపించి జప నామ స్మరణాదులతో అచ్చం విప్రలంభ శృంగారం లోని నాయిక విరహావస్థని స్మరింపజేసే విహ్వల స్థితిని అనుభవించడం కనిపిస్తోంది. అందుకే ఈ నాయిక జీవాత్మకు ప్రతీకగా నిలిచింది. నాయకుడు పరమాత్మకు ప్రతీకగా నిలిచాడు. ప్రకృతీ – పురుషుల సమాగమం ఈ సృష్టిలో పవిత్రమైన పరస్పర గాఢాసక్తితో సాధించవలసిన యోగం.

అందుకే ఆ శృంగారంలో ఆధ్యాత్మిక యోగాన్ని దర్శింపజేసే ప్రయత్నాన్ని జావళీ రచనలో చేయడం కనిపిస్తుంది.

కాబట్టి శృంగారం లోని ఆధ్యాత్మికతను దర్శించడానికి చక్కని మార్గాలు ఈ జావళీలు. భాగవతంలో గోపికలు పడే తపన, నిరంతరం భగవంతుని సాన్నిహిత్యంలో తరించాలనే భావన ఇక్కడ జావళీలలో నాయిక పాత్రలో కనిపిస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా చూస్తే స్ఫురించే తత్త్వం. సుప్రసిద్ధ విమర్శకులు కూడా చేసిన విశ్లేషణ ఇదే.

ఇక ఈ జావళీలలో ప్రయోగించిన పదాల్ని బట్టే గానీ, వర్ణల ఆధారంగా గానీ, వ్యక్త పరచిన మనోభావాల్ని గానీ పరిశీలించి ఆయా పాత్రల (నాయకుడు, నాయిక, చెలి) మానసిక సౌందర్యాన్ని అధ్యయనం చెయ్యడం ఎంతో అవసరం. ఎందుకంటే మానవ సహజ సిద్ధమయిన ఎన్నో తత్త్వాలు ఈ పాత్రలలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ జావళీ చూడండి.

ఫరజు – చాపు

ఏమని తెల్పుదునే కోమలి నా భాగ్య
మేమని తెల్పుదునే
నా ముద్దు సామికి నా మీద ప్రేమ

చెక్కిలి ముద్దాడెనే చక్కని నా సామి
చెక్కిలి ముద్దాడెనే
నిక్కముగ నిన్న రేయి ప్రక్కనే పవ్వళించి
చక్కని కెమ్మోవి నొక్కెనే

బాళిచే నన్నేలెనే కేళిలో నా సామి
బాళిచే నన్నేలెనే
వేళగదే రా రమ్మని విలువ గల సొమ్ములిచ్చి
చాలాగా లాలించెనే సోలెనే చాలనే

నా సాటి పేరనెనే
ఆస దీర్చి రామదాస కవి చిత్త
వాసుదేవుడాయె పూడేనే గంధము
చేసెనే బాసనే (4)

ఈ జావళీలో నాయిక తన నాయకునితో గడిపిన శృంగార మయ సన్నివేశాలన్నింటినీ తలుచుకొని, మధురోహా భంగ డోలికలలో తూగుతూ, తన ఆనందాన్ని మాటల్లో వ్యక్త పరుస్టూ, చెలికత్తెతో వివరిస్తోంది.

భర్తతో గన అన్యోన్య సంబంధాన్ని భారత స్త్రీ తన అదృష్టంగా, పూర్వ జన్మ పుణ్యంగా భావిస్తుంది. ఆ భర్త ఆలనా పాలనలో తన జీవితం సాఫీగా సాగి పోవాలని కలలు కంటుంది. అలాగే సాగి పోతూ ఉంటే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతుంది. ఆ భావమే ఇక్కడ ప్రస్ఫుటమయ్యింది.

అలాగే మరొక జావళీలో

బేహాగ్ – రూపక

సమయమిదే రారా నా సామి
తామసించకురా

కమల వైరి చనుదెంచితే
కాంక్ష లీడేరవుర

మగడు ఊరలేడు నా
మామగారి జోలి లేదని
వగతెగ తెలిసినదిగా
వట్టి పంతమేలర

మన్ననచే నీవు వచ్చి
నన్ను గూడి యుండునట్లు
నిన్న రేయి కలగంటిని
నీరజాక్ష! వేంకటేశ! (5)

స్త్రీ సున్నిత హృదయం కలది తన జీవితం బాధా రహితంగా, సుఖవంతంగా సాగాలని ఆశిస్తుంది. ఆ ఆశలే నిత్యం నెరవేరాలనే ఆలోచనలు హృదయంలో పరిభ్రమించడం ద్వారా ఇదే స్వప్నం లోనూ సాక్షాత్కరిస్తుంది.

నీరజాక్షుడయిన వేంకటేశునితో కూడి ఉండాలని, సమైక్యం చెందాలనేది నాయిక చిరకాల వాంఛా, ఆకాంక్ష. అదే ఆలోచన నిత్యం మస్తిష్కంలో పరిభ్రమించడంతో, అదే స్వప్నంలో కనిపించిందట.

భక్తి తత్త్వంలో ఒక ఆంతర్యం ఉంది. ఎవరి ప్రయత్నాన్ని వారే చేస్తూ, ఏదో మొక్కుబడిగా దేవుని ప్రార్థిస్తే, భగవంతుని అనుగ్రహం పొందడం కష్టం.

“అన్యథా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ”

అనే స్థితికి చేరుకోవాలి. అందుకే పోతన మహాకవి కూడా గజేంద్రునితో ఈ విధంగా పలికించారు.

“నీవే తప్ప నితః పరం బెరుగ మన్నింప దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా”

నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదనే అంతిమ స్థితికి, భక్తిలో పరాకాష్ఠకు చేరుకోవాలి. అప్పుడు గానీ భగవంతుని దయా వీక్షణాలు భక్తులపై ప్రసరించవు. అదే విధంగా ఈ జావళీల లోని నాయికలు నాయకుని పైనే ఏకైక ఆధారం కలవారు. అందుకే తమ ఆర్తుల్ని రూపు మాపే విధంగా ఆదుకోమని, వేరే దిక్కు లేదని శరణు కోరుతున్నారు.

మనసిజు బారికి నెటులోర్తునే
వనితరో
విభు నెడబాసిన మొదలు
దినమొక యుగమాయెనే

ముదితరో రమణుపై
మోహమగ్గలమై నిదురయు రాదాయెనే

కన్నెరో చెలువుని
కన్నుల జూడమిచే అన్నము సైచదాయనే

పణతిరో రాజగోపాలుడు
నాపై కనికర మెంచడాయెనే (6)

అని స్వామి కనికరాన్ని ఆకాంక్షిస్తోంది. దీనికి కారణం ఉంది. నిత్యమూ నాయకుని లక్షణాల్ని గమనించి, ఆస్వాదించి, ఆకర్షితురాలై, ఆ నాయకుని గుణగణాల్ని మర్చిపోలేక పోతోంది. అందుకే ఇలా

నాటకురంజి – ఆది

చలమేలర నాపై
జలజ నేత్రుడా పిలిచిన పలుకక
కలకాలము నీ చెలిమి
జేయనే దలచి వచ్చి యుంటి నంతట

నీ సరసములు నీటులు
నీ సొగసు నీ చతురత
నీ హొయలు నీ గుణములు
నీ సరి సమరసికులనే
సరసి జూడ దొరకలేక
మరులు మించి మొరలిడ

సామసరిపుని కోరు చకోర
గతి నిను నమ్ముచు
సారెకును నీ మరుగున
జేర దలచి చెలులతో
మనసార నా విచారమెల్ల
చెలియార దెల్పియు బ్రోవక(7)

అంటూ నాయక గుణగానం చేస్తోంది.

ఆధ్యాంతిక సిద్ధి కలిగి, జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి ఎన్నో సోపానాలున్నాయి. సత్యాన్ని గ్రహించడంతో మొదలై, భగవత్ తత్త్వాన్ని బోధ పర్చుకునేందుకు, భగవన్నామ స్మరణం, జప తపాతుల్ని నిర్వహించడం వంటి క్రియలు అవసరం. ఇక్కడ కూడా నాయిక నాయక గుణగణాల్ని కీర్తిస్తోంది.

ఇరుగు పొరుగు వారిని చూసి నేర్చుకోవడం, అనుసరించడం స్త్రీకి సహజ సిద్ధమైన నైజం. భార్యా భర్తల మధ్య అన్యోన్యతను నిరూపించేందుకు ఈ నాయిక ఉదాహరణలుగా కొందరిని చూపుతోంది.

నా నొసటనే పొడిచెనా యేమిరా
నానా వరవర్ణినులకు
నావలె కామము లేదా

పరమ శివు నౌదల
గంగా భామ లేదా
పరమేష్ఠి ముఖమున
సరస్వతి వసింపలేదా

దామోదరు రొమ్మున
లేదా ఇందిర
కామాక్షి హరు నర్థాంగనమున
చెనుగొన లేదా

నా వేణుగోపాల
నన్నేల రాదా
శ్రీ విలసిత శ్రీదాసు
శ్రీరామకవి వరదా

ఇది జావళీ రచన వెనుక నేపథ్యంగా ఆవిష్కృతమయిన పాత్రల మనో విశ్లేషణ ఏ ప్రయోజనం లేకుండా సాగదు. జావళీలలోని అంతరంగిక సాక్ష్యాలను బట్టి పైకి శృంగారంగా కనిపించినా, ఎన్నో విషయాల్ని తెలియజేసే సాక్ష్యాలుగా జావళీలు నిలుస్తాయనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు.